యాదగిరిగుట్టలో ఆంజనేయ స్వామికి వైభవంగా ఆకుపూజ
ఇది కద నిజం, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి అర్చకులు ప్రత్యేకంగా ఆకు పూజను నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం మంగళవారం నాడు స్వామివారికి జరిగే ఈ విశేష పూజను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా విష్ణు పుష్కరిణి ఆవరణలో కొలువై ఉన్న ఆంజనేయ స్వామి వారికి అర్చక బృందం వేదమంత్రాల సాక్షిగా ‘మన్య సూక్త’ పారాయణం చేస్తూ శాస్త్రోక్తంగా అభిషేకం జరిపారు. అనంతరం స్వామివారికి సింధూరంతో విశేష అలంకరణ చేసి, నానా రకాల సుగంధ ద్రవ్యాలు మరియు పరిమళ భరితమైన పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ముఖ్య ఘట్టమైన ఆకు పూజలో భాగంగా స్వామివారిని తమలపాకులతో అర్చించి, ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ వేడుకలో స్థానిక భక్తులతో పాటు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. హనుమన్నామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.
