పాతగుట్టలో వైభవంగా ముగిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి అధ్యయనోత్సవాలు
ఇది కద నిజం,యాదగిరిగుట్ట (పాతగుట్ట): యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా అత్యంత వైభవంగా సాగుతున్న ‘అధ్యయనోత్సవాలు’ మంగళవారం (తేదీ: 27-01-2026) నాటితో ఘనంగా ముగిశాయి. విశ్వావసు నామ సంవత్సర మాఘ శుద్ధ షష్టి పర్వదినాన్ని పురస్కరించుకొని, ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవాల ముగింపు రోజైన మంగళవారం స్వామివారికి నిత్యారాధనలు నిర్వహించిన అనంతరం ‘పురప్పాట్టు సేవ’ను వైభవంగా జరిపారు. ఇందులో భాగంగా శ్రీ రామానుజాచార్య తిరుమంజనం, ఇరామానుజ నూత్తందాది శాత్తుమురై అనుసంధానమును అర్చక బృందం వేదమంత్రాల సాక్షిగా పూర్తి చేశారు. అళ్వారులు తమ పాశురాలలో భగవంతుని దివ్య స్వరూపాన్ని స్తుతించిన రీతిని గుర్తుచేస్తూ, లోక కల్యాణం కోసం భగవద్ అనుగ్రహాన్ని ప్రార్థించడం ఈ అధ్యయనోత్సవాల ప్రత్యేకత అని పండితులు పేర్కొన్నారు.
ఉత్సవాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా, ఈ వేడుకల్లో పాల్గొన్న పారాయణదారులను ఆలయ మర్యాదలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ మరియు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కె. వినోద్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు, ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో ఈ ఉత్సవాలను కనుల పండువగా నిర్వహించారు. ఈ ముగింపు వేడుకను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
